అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం (Ananthapuram) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని తాడిపత్రి (Tadipatri) మండలం రావివెంకటపల్లెలో ఓ కారు (Car accident) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్ని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతులను మోహన్ రెడ్డి, విష్ణువర్ధన్, నరేశ్ రెడ్డిగా గుర్తించారు.
తాడిపత్రికి చెందిన మోహన్ రెడ్డి ఇటీవల కొత్త కారు కొన్నారు. దీంతో స్నేహితులతో కలిసి దావత్ చేసుకున్నారు. పార్టీ అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతిచెందగా, శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు గాయపడ్డాడని చెప్పారు. మద్యం మత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.