ఏలూరు: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవరప్పాడు హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రమణ ట్రావెల్స్ బస్సు సోమవరప్పాడు హైవేపై ముందు వెళ్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, రోడ్డుపై బస్సు అడ్డంగా పడిపోవడంతో హైవే భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో క్రేన్ హాయంతో బస్సును పక్కకు తొలగించారు. ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.