అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి టీఎస్ వైఎస్సార్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) కాంగ్రెస్(Congress)లో చేరికపై ఏపీ మంత్రులు, నాయకులు స్పందించారు. ఆమె కాంగ్రెస్లో చేరడం వల్ల ఏపీ రాజకీయాల్లో ఒరిగేదేమి లేదని, జగన్ను ఓడించే సత్తా ఎవరికి లేదని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy) మాట్లాడుతూ సీఎం జగన్కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయితే ఆమె వెంట తాము ఎందుకు వెళ్తామని, తమ రాజకీయ భవిష్యత్ను ఎందుకు నాశనం చేసుకుంటామని అన్నారు.
మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Minister Vellampalli Srinivas) మాట్లాడుతూ షర్మీల పార్టీ మారడం ఆమె ఇష్టమని అన్నారు. ఆమె నిన్నటి వరకు తెలంగాణలో పార్టీని నడిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. భవిష్యత్లో ఏం మాట్లాడుతారో చూడాలని వ్యాఖ్యనించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదని వెల్లడించారు. టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ నాయకులంతా టీడీపీలోకి వచ్చేస్తారని గతంలో చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇప్పటి వరకు గేట్లు ఎందుకు తెరవలేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీ వైసీపీలో షర్మిలకు స్థానం లేకనే తెలంగాణలో పార్టీ పెట్టుకుందని , ఎవరు ఏ పార్టీలో చేరినా రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని దీమాను వ్యక్తం చేశారు.