అమరావతి: పీఆర్సీతో పాటు పలు డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలతో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చింది. వారితో చర్చించిన మంత్రుల కమిటీ.. సమావేశం వివరాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించడంతో పీఆర్సీ సాధన కమిటీ ఆదివారం సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఈ ప్రభుత్వం ఉద్యోగులది.. ఉద్యోగుల సహకారంతో మంచి చేయగలుగుతున్నాను. ఉద్యోగుల వల్లే అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పథకాలు అమలుచేస్తున్నా. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ, ఎంతమేర మేలు చేయగలమో అన్ని రకాలుగా చేశాం’ అని అన్నారు. రాజకీయాలకు తావుండకుండా.. ఏదైనా సమస్య ఉంటే నేరుగా నాకు చెప్పండి అని ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మంత్రుల కమిటీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఐఆర్ ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ 9 నెలల ఐఆర్ను సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5,400 కోట్ల భారం పడుతోందన్నారు. కొత్త ప్రతిపాదనల వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.11,500 కోట్ల భారం పడుతుందని చెప్పారు. సీపీఎస్పైన గట్టిగా పనిచేస్తున్నామని, వివరాలు ఖరారయ్యాక ఉద్యోగులకు చెప్తామని జగన్ పేర్కొన్నారు.
రిటైర్ అయ్యాక కూడా ఉద్యోగులకు మంచి జరిగే దిశగా అడుగులు వేస్తున్నట్లు జగన్ తెలిపారు. ఉద్యోగులకు తెలియాలనే ఈ విషయాలన్నీ చెప్తున్నానని జగన్ అన్నారు. అంతదూరం వెళ్లాల్సిన అవసరం లేదని, అలా చేయకుండా కూడా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అభయమిచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు అంగీకరించినందుకు ఉద్యోగులకు ధన్యవాదాలు చెప్తున్నానన్నారు.