గుంటూరు : గుంటూరులో సినీఫక్కీలో దొంగలు బ్యాంకుకు కన్నం వేసి భారీగా నగదు కొల్లగొట్టారు. నగరంలోని గాంధీపార్క్ వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. చోరీకి పక్కాగా ప్రణాళిక వేసిన దొంగలు ఆదివారం రాత్రి చాకచక్యంగా బ్యాంకులోని ప్రవేశించి గ్యాస్ కట్టర్తో లాకర్ కట్ చేశారు. లాకర్లోని దాదాపు రూ. 25 లక్షల నగదును అపహరించారు. బ్యాంకు దోపిడీ చేసేందుకు ముందుగానే పతకం పన్నినట్లు దొంగతనం చేసిన తీరును పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. బ్యాంకు లోపల సీసీ కెమెరాలను ధ్వంసం చేసి స్ట్రాంగ్రూంకు రంధ్రం చేసి లాకర్లను పగులగొట్టినట్లు తెలిసింది. ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్టీం ఆధారాలు సేకరించాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.