అమరావతి : ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఏపీ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ (Velampally Srinivas) ఆరోపించారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు తోడేళ్లులా రాష్ట్రాన్ని ముంచేయడానికి ఎన్నికలకు వస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి పేరిట చంద్రబాబు(Chandra Babu) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని ఆరోపించారు.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి మహిళా లోకాన్ని మోసం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమ్మ బడి, అమ్మకు వందనం లాంటి పథకాలను , వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని పేర్కొన్నారు. మాజీ మంత్రి బోండా ఉమా డ్రైనేజీల కాల్వ గట్ల నిర్మాణంలో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. ఆయన విజయవాడ నగర అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేశారని వెల్లడించారు.