Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విమర్శించారు. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ అనేది ఉండదని అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీమల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో విజయసాయి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీ బీజేపీలో విలీనం కావాల్సిందేనని విజయ సాయి రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా అంతే అని విమర్శించారు. బీజేపీలో విలీనం చేయడం తప్ప వారికి వేరే దారి లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్లే ఆ పార్టీతో మంచి సంబంధాలు కొనసాగించామని తెలిపారు. అప్పుడే రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్కలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని విజయ సాయి రెడ్డి తెలిపారు. ఏ రాష్ట్రం కూడా పరిమితి మించి అప్పులు చేయదని వివరించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ప్రజలు అలాంటి అసత్య ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో దుష్ప్రచారం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ప్రజల గుండెల్లో వైసీపీ ఉందని.. ఐదేండ్లలో జగన్ వారి మనసుల్లో నిలిచిపోయారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని స్పష్టం చేశారు.