అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తుతున్న ఉద్యోగ సంఘాలు మరో గంటలో భేటీ కానున్నాయి. ఉదయం11.30 నిమిషాలకు విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, ఏపీ అమరావతి ఉద్యోగ సంఘంతో పాటు మరికొన్ని సంఘాలకు చెందిన ప్రతినిధులు భేటీలో పాల్గొననున్నారు. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జీవితాలు, జీతాలతో చెలగాటమాడుతుందని ప్రకటించిన పీఆర్సీ వ్యతిరేక జీవోలన్నింటినీ రద్దు చేసుకోవాలని కోరుతున్నారు.
ఐఆర్ కంటే పీఆర్సీని తక్కువగా ప్రకటించడం , హెచ్ఆర్ఏలో కోతలు విధించడం తదితర అర్ధరాత్రి జీవోలను పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సచివాలయంలో ఈ రోజు భేటీ కావాల్సిన సంఘాల ప్రతినిధులు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండడంతో భద్రత కారణాల దృష్ట్యా భేటీని విజయవాడ టీఎన్జీవో కార్యాలయానికి మార్చారు. ఈ భేటీలో భవిష్యత్తు ఆందోళన కార్యాక్రమాలపై చర్చించి మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలోనే ఉమ్మడి ప్రకటన చేయనున్నారు.