అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ప్రకారమే పాలన కొనసాగుతుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏపీలో పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఏపీలో మూడురాజధానుల వ్యవహరంపై ఏపీ రాజధాని అమరావతి రైతులు వేసిన కేసులపై మార్చి మొదటివారంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాసన సభకు చట్టాలు చేసే అధికారం లేదని , ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వానికి ఆదేశించింది.
దీంతో హైకోర్టు వ్యాఖ్యలపై వైసీపీ సభ్యుడు ధర్మాన ప్రసాధరావు అసెంబ్లీలో చర్చకు అనుమతి కోరుతూ స్పీకర్కు లేఖ రాశారు. దీంతో ఇవాళ చర్చకు అనుమతి ఇవ్వడంతో అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు మాట్లాడారు. ప్రాంతాల మధ్య అసమానతల్ని తొలగించాలని రాజ్యాంగంలో ఉందని మంత్రి బుగ్గన అన్నారు. ప్రాథమిక హక్కులపై రాజ్యాంగంలో స్పష్టత ఉందని, ప్రాథమిక హక్కులను ఎవరూ లాక్కోకుండా రక్షణ ఉందని పేర్కొన్నారు. ఒకరి హక్కును ఇంకొకరు లాక్కోకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ కన్నా ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలు వెనకబడి ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని వివరించారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులున్నాయని తెలిపారు.
ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ న్యాయవ్యవస్థతో పాటు మిగిలిన శాసన, కార్య నిర్వాహణ వ్యవస్థలు సమానమేనని సుప్రీంకోర్టే చెప్పిందని ధర్మనా ప్రసాద్రావు తెలిపారు. న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పులను సమీక్షించే అధికారం పౌరులకు ఉంటుందని పేర్కొన్నారు.