అమరావతి : ఏపీలోని వైసీపీ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై వరుస నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో రెండోరోజు ఆయన పార్టీకి చెందిన నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. టీడీపీ మహానాడు వరకు వరుస ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8న రైతు సమస్యలు, 11న నిత్యావసరాల ధరల పెంపుదల, సంక్రాంతి కానుకల రద్దుపై ఆందోళనలు నిర్వహించాలని సూచించారు.
నియోజకవర్గాల్లో సమస్యలపై పోరాడకుంటే ఫలితముండదని, వివిధ వర్గాలను అక్కున చేర్చుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. నాయకులు ధైర్యంగా లేకుంటే కార్యకర్తలు డీలా పడతారని వివరించారు. ఈ ఏడాది టీడీపీకి చాలా ముఖ్యమని, పార్టీ పరంగా ఏం చేసినా ఈ ఏడాదే చేయాలన్నారు. ఎన్టీఆర్ జన్మించి వచ్చే ఏడాది వందేళ్లు అవుతుందని ఆ మహనీయుడి జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఏపీ సీఎం జగన్ చేసిన తప్పులను చరిత్ర ఎన్నటికీ మరిచిపోదని రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని ఆరోపించారు. ఉద్యోగులకు గతంలో ఎప్పుడూ లేనంతగా తమ ప్రభుత్వ హయాంలో ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుత వైసీపీ హయాంలో అన్ని వర్గాలు రోడ్డున పడుతున్నాయని వెల్లడించారు.