అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమరం రేపటి నుంచి ప్రారంభం కానున్నది. రాష్ట్రంలో అసెంబ్లీ (Assembly) తో పాటు పార్లమెంట్(Parliament) స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఇప్పటికే ప్రచారంలో ముందున్న పార్టీలు, అభ్యర్థులు రేపటి నుంచి నామినేషన్ల ఘట్టంలో పాల్గొననున్నారు.
నాలుగో విడతలో ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4 ఫలితాలు వెల్లడికానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల (Nominations) ప్రక్రియ ప్రారంభమై 25వ తేదీన ముగియనుంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు విధించింది.
కాగా ఏపీలో ఇప్పటికే అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆ పార్టీలకు చెందిన అధినేతలు బస్సుయాత్రలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గురువారం జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారమ్లు అందజేశారు.