అమరావతి : ఏపీలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరవధిక సమ్మె గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలు జిల్లాలో కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మున్సిపల్ వినూత్న నిరసన తెలిపారు. వైఎస్సార్ విగ్రహం వద్ద అర్దనగ్నంగా మోకాళ్లపై కూర్చుండి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెత్త ట్రాక్టర్లు బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మెడికల్ అలవెన్సులు ఇవ్వాలని, కార్మికులకు పనిభారం పెరిగినందును అదనపు సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మికులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు.
అనంతపురంలో కార్మికులు రహదారిపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని, కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటీని నెరవేర్చాలని నినాదాలు చేశారు.