అమరావతి : ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) తెలిపారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలిపివేసిన ఢిల్లీ పెద్దలకు ఓటుతో బుద్ధి చెప్పాలని, ఈ ఎన్నికల్లో కూటమి ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని కోరారు.
రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలను అన్నారు.విద్యార్థులకు ట్యాబ్లు వసతి దీవేన, రైతులకు పెట్టుబడి సాయం, పగటిపూటనే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ , ఆర్బీకే (RBK) వ్యవస్థను తీసుకొచ్చి విజయవంతంగా సంక్షేమాలను అమలు చేస్తున్నామని ప్రకటించారు.
చంద్రబాబు హయాంలో ఏ ఒక్కటి పేదలకు గుర్తింపు ఉండిపోయేలా పథకం చేపట్టలేదని విమర్శించారు. మేనిఫెస్టోలో సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి ఇస్తున్న మోసపు హామీలను నమ్మవొద్దని కోరారు. స్వయం ఉపాధికి అండగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్లకు వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు తోడు చేదోడు పథకాలను అందిస్తున్నామని చెప్పారు.