Botsa Satyanarayana | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జూలై 13, (నమస్తే తెలంగాణ): ‘సొమ్ములు పోనాయి.. నానేటి సేసేది.. నానేటి గావాల్న జేసినాన ఇదంతా?’.. ఇవి 18 ఏండ్ల కింద అప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర యాసలో అన్న మాటలివి. విశాఖలో ఫోక్స్వ్యాగన్ కార్ల కంపెనీ ఏర్పాటుకని టోకెన్ అడ్వాన్స్గా రూ.11.67 కోట్ల ప్రజాధనాన్ని మంత్రి హోదాలో బొత్స ఓ డూప్లికేట్ కంపెనీకి చెల్లించిన కుంభకోణంలో చిక్కుకొన్నారు. బొత్స తీరుపై అప్పట్లో పెద్ద వివాదం చెలరేగింది. మంత్రి తమకు డబ్బు చెల్లించలేదని ఫోక్స్వ్యాగన్ కంపెనీ ప్రకటించింది. ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ప్రతినిధులమని నమ్మించడంతో వశిష్ట వాహన్ అనే సంస్థ ప్రతినిధులకు చెల్లించినట్టు తెలుసుకొని బొత్స తెల్లముఖం వేశారు. దీంతో అన్ని పత్రికలు పతాక శీర్షికల్లో ఆయన నిర్వాకాన్ని ప్రచురించాయి.
దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. విచారణకు డిమాండ్ చేయడంతో ఈ అంశాన్ని సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐకి అప్పగించారు. అప్పుడు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటంతో మంత్రి బొత్సకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎట్టకేలకు చెల్లించిన మొత్తం రూ.11.67 కోట్లలో రూ.7 కోట్లను మాత్రమే ఇందులో పాత్ర ఉన్న మోసగాళ్ల నుంచి సీబీఐ రికవరీ చేసింది. మిగతా డబ్బులు ఏమైందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కుంభకోణాలు ఎన్నింటిలోనో ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి బొత్స, తాజాగా తెలంగాణలో కుంభకోణాలు జరుగుతున్నాయని అనడమంటే ‘దొంగే, దొంగ… దొంగా’ అని అరిచినట్టు ఉందని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలాంటి బొత్స ఇప్పుడు తెలంగాణ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అవినీతి బొత్స సత్యనారాయణ తమకు నీతులు చెప్పడమేంటని ఫైర్ అవుతున్నారు.