Vivekam | అమరావతి : ఏపీలో ప్రధాన పార్టీల మధ్య సినిమాల యుద్ధం కొనసాగుతుంది. అధికార వైసీపీ గత ప్రభుత్వాల ప్రతినిధులపై రెండు సినిమాలు తీస్తే తామేమి తక్కువ కాదంటూ వైసీపీ ఆగడాలపై టీడీపీ నాయకులు మరో చిత్రం తీసి విడుదల చేశారు. వైఎస్ వివేకానంద హత్య (YS Viveka Murder) కు సంబంధించిన వివరాలతో కూడిన వివేకం (Vivekam) అనే చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు.
వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో సినిమా చిత్రీకరించారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) ఫిర్యాదు చేశారు. రాజకీయపార్టీకి సంబంధించిన పలు సన్నివేశాల్లో వైఎస్సార్సీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారని , పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పేరు సహా ఇతర పాత్రలను కూడా అదే పేర్లతో ఉచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా ఉందని, ఈ సినిమాను యూట్యూబ్లో ప్రదర్శించడం, వివేకా బయోపిక్కామ్ అనే వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రాన్ని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.