అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీతో జరుపుతున్న చర్చల్లో ఇంకా ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. పీఆర్సీతో పాటు ఇతర ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించాలని జేఏసీ నాయకులు గత కొన్ని రోజులుగా ఏపీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కాగా సీఎం జగన్ ఆదేశాల మేరకు బుధవారం పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమావేశమై చర్చలు జరుపుతున్నారు.
దాదాపు ఐదు గంటల నుంచి ఇరుపక్షాల మధ్య చర్యలు జరుగుతూనే ఉన్నాయి. నల్లబ్యాడ్జిలు ధరించి చర్చలకు వచ్చిన జేఏసీ నాయకులు పిట్మెంట్ను 48శాతం ఇవ్వాలని కోరుతుండగా తాము 14.29శాతం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఫిట్మెంట్ను అసుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సులకు కట్టుబడి ఉన్నామని మంత్రులు స్పష్టం చేస్తున్నా అధికారుల కమిటీ సిఫారసులను అంగీకరించే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న చర్చలపై జేఏసీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.