అమరావతి : అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన ఏపీలోని పలు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. తమకు వేతనాలు పెంచాలని, అంగన్వాడీల సమస్యలను తీర్చాలని కోరుతూ గత 17 రోజులుగా అంగన్వాడీలో సమ్మె నిర్వహిస్తున్నారు. నిన్న(మంగళవారం) అంగన్వాడీల ప్రతినిధుల తో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు బుధవారం సమ్మెను ఉధృతం చేశారు. ఎమ్మెల్యేల ఇంటి వద్ద ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
దీంతో విజయవాడ(Vijayawada) లో ఎమ్మెల్యేల ఇంటి వద్దకు వెళ్లిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుని బలవంతంగా వ్యాన్లో ఎక్కించారు. విజయనగరంలో మంతి బొత్స సత్యనారాయణ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించడంతోపోలీసులు, అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది . ఈ తోపులాటలో అంగన్వాడీ కార్యకర్త సంతోషి స్పృహ తప్పిపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.