అమరావతి : మెగా డీఎస్సీని అమలు చేయాలంటూ కాంగ్రెస్ చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. విజయవాడలో కరకట్ట సమీపంలో కొండవీటి ఎత్తిపోతల వద్ద ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila )తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడిరోడ్డుపైనే బైఠాయించిన కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు, మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కరకట్ట వద్ద పోలీసులు మోహరించి షర్మిలను పోలీసు వ్యాన్లో ఎక్కించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిల మాట్లాడుతూ మెగా డీఎస్పీ అంటూ ఏపీ ప్రభుత్వం దగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యబద్దంగా వినతిపత్రం ఇవ్వడానికి వెళితే అక్రమంగా అరెస్టు (YS Sharmila arrest) చేయడం దారుణమని పేర్కొన్నారు. చలో సచివాలయం పిలుపులో భాగంగా పోలీసులు ముందస్తు కాంగ్రెస్తో పాటు వామపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్నారు.