అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈవాళ అసెంబ్లీకి చిడతలు తీసుకొచ్చి వాయిస్తూ నిరసన తెలుపడంతో స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సారా మరణాలపై అసెంబ్లీలో చర్చించాలని పట్టుబడుతూ టీడీపీ సభ్యులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగిరమేశ్ మాట్లాడుతూ విలువైన సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న టీడీపీకి చెందిన 4గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కోరారు.
ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేనని అంబటి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఒక్క సమస్యను ఎన్ని రోజులు సాగదీస్తారని ప్రశ్నించారు. సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. శాసన సభా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ఏపీలో చీప్లిక్కర్ను ప్రవేశపెట్టారని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బెల్ట్షాపులను రద్దు చేశారని తెలిపారు.