అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని పేర్కొంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో, టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మె్ల్సీలు అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. గత బడ్జెట్లో 93 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనుమతి లేకుండా ఖర్చుచేశారని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వానిక ఆర్థిక క్రమ శిక్షణ కొరవడిందని అన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
విచ్చలవిడిగా, ఇష్టారాజ్యంగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. బడ్జెట్లో కేటాయింపులకు ఖర్చు చేయకుండా 93వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపించారు. మరో 46 వేల కోట్ల రూపాయలకు ఎక్కడికి పోయాయని విమర్శించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయ్యిందని దుయ్యబట్టారు . గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో జగన్ వాస్తవాలకు భిన్నంగా మాట్లాడారని ఆరోపించారు.