అమరావతి : ఏపీ శాసన సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ శాసన సభ బడ్జెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి శాసన రాజధానిగా గుర్తిస్తున్నామని బొత్స మరోసారి స్పష్టం చేశారు.
ఏపీకి రాజధాని అమరావతి చట్ట ప్రకారం జరుగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం మూడు రాజధానులు ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని వ్యాఖ్యనించారు. తమ ఎన్నికల ప్రణాళికలో భాగంగా పార్లమెంటరీకి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.