అమరావతి : అనంతపురం జిల్లా పోలీసుల వైఖరి కారణంగా ఓ చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతి చెందిన సంఘటనపై ఏపీకి చెందిన పలువురు నాయకులు తీవ్రంగా స్పందించారు. సీఎం, మంత్రులు బయటకొస్తే జనం బలవ్వాలా అని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులను ప్రశ్నించారు.మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆస్పత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణమని అన్నారు. అత్యవసర చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లే చిన్నారిని అడ్బుకోవాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది. అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణమైన పోలీసులు సమాదానం ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ పర్యటనలో పోలీసులు అతిగా ప్రవర్తించారని నారా లోకేశ్ ఆరోపించారు. కళ్యాణదుర్గంలో చావు బతుకుల్లో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే దారివ్వలేదని అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం కారు ఎక్కితే చాలు షాపులు మూసివేసి లోపలే ఉండాలని హెచ్చరిస్తున్నారని తెలిపారు.