Varla Ramaiah | అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని వైఎస్సార్ సీపీ శ్రేణులకు అర్థమైందని.. అందుకు ఆ పార్టీ నేతలు ఎవరూ బయటకు రావడం లేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వస్తారని.. లండన్ వెళ్లిన జగన్ తిరిగివస్తారో రారో అంటూ విమర్శించారు. తమ నాయకుడి రిటర్న్ టికెట్ గురించి తనకు తెలుసని.. ఆ పార్టీ నేత తిరుగు టికెట్ గురించి తెలుసా? అంటూ వైఎస్సార్సీపీని ప్రశ్నించారు.
జగన్ లండన్ వెళ్తూ వైఎస్సార్సీపీకి 144 స్థానాలు వస్తాయిలే అన్నా అని సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పారట.. అబద్ధాలతో మాయ చేయాలని సజ్జల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోలింగ్ ముగిసిన రోజు నుంచి వైఎస్సార్సీపీ నేతల్లో నిరాశ, నిస్పృహలు పెరిగాయన్నారు. ఎవరు కనబడినా వారిపై అభాండాలు వేస్తున్నారన్నారు. వాళ్ల నీలి పత్రికలో ఇవాళ రాశారని.. వెబ్ కాస్టింగ్ను హైజాక్ చేశారని.. ఆ బటన్లు నొక్కే కంట్రోల్ చంద్రబాబు వద్ద ఉందంట.. బుద్ధిలేని రాతలు ఇవి అంటూ విమర్శించారు. పత్రిక చేతిలో ఉందని ఇష్టంవచ్చినట్టు రాస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్ కాస్టింగ్ ను నియంత్రించేది ఈసీ అని.. సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు.
లోకేశ్కు ఈవీఎం వీడియో ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారని.. ఆయన ఒక్కరి వద్దే కాదు సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి వద్దకు వీడియో వచ్చిందన్నారు. ఘటన జరిగిన తర్వాత.. పోలీసులు అతడిని గౌరవంగా కారెక్కించి పంపిస్తారా? వారంతా మీరు నియమించిన పోలీసులేనని.. ఇందులో చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల కోసం కొన్నిచోట్ల కౌంటింగ్కు వైసీపీ ఏజెంట్లుగా ఉండేందుకు ఎవరూ రావడం లేదని.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్నారు. ప్రజలు తిరగబడ్డారని.. ఫలితం ఏంటో జూన్ 4న తెలుస్తుందని వర్ల రామయ్య పేర్కొన్నారు.