ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైతు రాజ్యం తెస్తానని చెప్పి, ఏపీని రైతుల్లేని రాష్ట్రంగా మార్చిపారేశారని లేఖలో విమర్శించారు. దేశ వ్యాప్తంగా చూసుకుంటే రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో వుందని, దీనికి వైసీపీ సర్కార్ కారణం కాదా? అని లోకేశ్ ప్రశ్నించారు.
3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని లోకేశ్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతుల్ని అసలు గుర్తించారా? తుపాన్లు, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఎంత మందిని ఆదుకున్నారు? రైతుల నుంచి గతేడాది కొన్న ధాన్యం డబ్బులు ఇచ్చారా? ఈ ఏడాది ధాన్యం కొన్నారా? అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలతో పాటు.. ఏపీలో క్రాప్ హాలిడే తెచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరిది? అంటూ ప్రశ్నించారు. ముదిగొండలో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ తండ్రి చరిత్ర మరిచిపోయారా? సోంపేటలో తమ భూములు లాక్కోవద్దని ఆందోళన చేసిన రైతుల్ని కాల్చి చంపిన చరిత్ర మీ తండ్రిది కాదా? అంటూ సీఎం జగన్ను లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.