Guntur | ఏపీలోని గుంటూరులో టీడీపీ నేత, అతని కుటుంబసభ్యులు దాష్టీకంగా వ్యవహరించారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ఈ నెల 15వ తేదీన జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణబాబుకాలనీకి చెందిన ఓ మహిళ ఈ నెల 15వ తేదీ రాత్రి తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీటిని పట్టుకుంటున్నారు. ఇది గమనించిన 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబసభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆమె ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి, ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. అనంతరం అందరూ కలిసి ఆమె వెంటపడి దుస్తులు చింపేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు.
నడిరోడ్డుపై వివస్త్రగానే ఉంచి దౌర్జన్యానికి దిగారు. అయితే స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ నెల 16వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూర్తి, అతని సోదరి సహా 9మందిపై కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు అదుపుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటన అనంతరం టీడీపీ కార్యదర్శి మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం.