అమరావతి : రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీలో చేరేందుకు బీజేపీ, టీడీపీలకు చెందిన ముఖ్యనాయకులు తమతో టచ్లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీకి చెందిన ప్రముఖులతో చర్చలు కొనసాగుతున్నాయి. వారిని ఏక్షణంలోనైనా పార్టీలో చేర్చుకుంటాం. వచ్చే రెండేళ్లలో టీడీపీ దుకాణం ఖాళీ అవుతుంది. పార్టీలో చేరే వారికి ప్రాధాన్యత ప్రకారం తగిన విధంగా గౌరవం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీదే విజయం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. అనంతపురం, కుప్పంలో టీడీపీ డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో టీడీపీ ద్వంద్వ ప్రమాణాల వల్లే అనేక చోట్ల పోటీకి కారణం అయ్యిందని విజయసాయి రెడ్డి వెల్లడించారు. ప్రచారంలో లోకేశ్ వాడుతున్న పదజాలం అనాగరికంగా ఉందని అన్నారు.