AP News | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతి విషయంలోనూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో చాలామంది నేతలు పార్టీలు మారుతున్నారు. ఇటీవల వైసీపీ నుంచి బయటకొచ్చిన పలువురు టీడీపీకి మద్దతు పలికారు. దీంతో పార్టీ మారిన ఆ నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు తాజాగా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ కూడా వాళ్ల రూట్లోనే వెళ్తున్నది. గతంలో తమ పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిపై అనర్హత పిటిషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
టీడీపీ నుంచి గెలిచిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అధికార వైసీపీలో కొనసాగుతున్నారనే ఆధారాలతో స్పీకర్కు ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ లేదా రేపు స్పీకర్ను కలిసి పిటిషన్ ఇచ్చే అవకాశం ఉంది. వీలైనంత తొందరగా ఈ నలుగురు ఎమ్మెల్యేలపై వేటువేయాలని కోరనుంది. ఇదిలా ఉంటే నిన్న వైసీపీ కూడా తమ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లకు ఫిర్యాదు చేసింది. దీనికి కౌంటర్గా ఇప్పుడు టీడీపీ కూడా నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసేందుకు సిద్దమవ్వడం గమనార్హం.