తిరుపతి: తిరుపతి మహతి కళాక్షేత్రంలో తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శాంత వసంత ట్రస్ట్ సహకారంతో ఈ తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకాన్ని ముద్రించింది. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు మనసుకు ఊరట కల్పిస్తాయన్నారు. ఈ కీర్తనలు అన్ని స్థాయిలవారికి అనురక్తిని కల్పిస్తాయని ఆయన చెప్పారు. ఈ కీర్తనలు పరిశోధన వైపు నడిస్తే అదే విజ్ఞానం అవుతుందని, భగవంతుని పాదాలు విడిచి పెట్టకుండా ఉండే మార్గంగా మారుతుందన్నారు.
అన్నమయ్య భగవత్ అంశ అని ఆయన తెలిపారు. టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాల తరువాత టీటీడీ అన్నమయ్య రాతప్రతుల్లోని 289 కీర్తనలను ముద్రించిందన్నారు. వరప్రసాద్ రెడ్డి, బసవ శంకర మూర్తి ఇందుకు సహకరించారని తెలిపారు. అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనల్లో 14 వేలు లభించాయని, ఇందులో 4 వేల సంకీర్తనలను టీటీడీ స్వరబద్ధం చేసిందని చెప్పారు.
వీటిలో 100 దాకా సంకీర్తనలు మాత్రమే జనబాహుళ్యంలోకి వెళ్లాయని ఆయన చెప్పారు. మిగిలిన వాటిని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి 4 వేల సంకీర్తనలపై యువతీయువకులకు గాన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంకీర్తన అందరికీ అర్థమయ్యేలా సరళమైన తెలుగులో భావం, అర్థం ప్రచురించేందుకు టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు.