తిరుమల: స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు గంటల కొద్దీ నిరీక్షించకుండా వెంకన్న దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి గురువారం మీడియాతో చెప్పారు. గంటన్నరలోపే భక్తులకు సర్వదర్శనం చేయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆన్లైన్ ద్వారా దర్శనంతో పాటు వివిధ సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.
గత రెండు నెలల క్రితం వరు టైమ్స్లాట్ ద్వారా శ్రీవారి దర్శనం బుక్ చేసుకునేవారని, అయితే, తోపులాటలు జరుగకుండా క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతిలోని శ్రీభూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో టైమ్స్లాట్ టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు.
గత రెండున్నరేళ్లలో తిరుమలలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మారెడ్డి గుర్తు చేశారు. ఇప్పటి వరకు 216 బైండోవర్ కేసులు పెట్టి.. 1,377 మందిని తిరుమల కొండకు రానివ్వడం లేదని పేర్కొన్నారు. తిరుమలలో ఉన్న 7,500 గదులకు మరమ్మతు పనులు చేపట్టామని, 4,500 గదుల మరమ్మతులు పూర్తికాగా.. మరో 750 గదుల పనులు జరుగుతున్నాయని తెలిపారు.. రెండున్నరేండ్లలో రూ.1,500 కోట్ల విరాళాలు వచ్చాయని, హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర పనులకు ఉపయోగించకుండా బ్యాంకుల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు.