తిరుమల : తిరుమలలో స్వామివారి ఆశీర్వాదంతోనే భక్తులకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా విరిగి పడ్డ కొండచరియలతో ధ్వంసమైన మార్గాన్ని శనివారం పరిశీలించారు. ఈనెల 1వ తేదీన తిరుమల ఘాట్రోడ్లోని భాష్యాకర్ల సన్నిది ప్రాంతంలో నాలుగుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని ఆ సమయంలో భక్తులు ప్రయాణంలో ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ప్రమాదం జరుగకుండా స్వామివారే కాపాడారని, అందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
నిపుణుల సలహా మేరకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని , తాత్కాలికంగా లింక్ రోడ్డు ద్వారా వాహనాలను కొండమీదకు అనుమతిస్తున్నట్లు ఆయన మీడియకు వివరించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. నిపుణుల సూచనలతో రక్షణ చర్యలు చేపడతామని అన్నారు. ధ్వంసమైన రోడ్డును.. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.