అమరావతి: వైఎస్సార్ కడప జిల్లాలో ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది. జిల్లా కేంద్ర శివారులో ఉన్న ఫార్మసీ కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వసతి గదిలో చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. ఆమె మృతికి గత కారణాలు తెలియ రాలేనప్పటికీ కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థిని మృతి సమాచారాన్ని తల్లిదండ్రులకు అందజేశారు.
అయితే విద్యార్థిని మృతి పట్ల పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. విద్యార్థిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆరోపణలు చేశారు. విద్యార్థి మృతి వెనుక గల కారణాలు తెలుసుకోవాలని, నిర్లక్ష్యం వ్యహరించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.