అమరావతి : ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులను డీజీపీ సస్పెన్షన్ చేశారు. సెబ్ సీఐ శ్రీనివాసరావు, మస్తానయ్య, కానిస్టేబుల్ శ్రీహరిపై వేటు వేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలం పొగుటూరుకు చెందిన బెల్లం వ్యాపారి కొల్లూరు దుర్గారావు ఆత్మహత్యకు కారణమంటూ ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణ జరిపిన తరువాత ముగ్గురిని సస్పెన్షన్ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని సెబ్ ఏసీపీ చక్రవర్తికి డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి ఆదేశాలు చేశారు.
ఇటీవల దుర్గారావును విచారణ నిమిత్తం జంగయ్యగూడెం పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఏలూరులో రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో దుర్గారావు కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. దుర్గారావు పోలీస్స్టేషన్ నుంచి పారిపోయాడని పోలీసులు చెబుతున్న కథనాలను కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు.