Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఉన్న కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ న్యాయవాది బి.బాలయ్య పిటిషన్ వేశారు. చంద్రబాబుపై ఉన్న ఏడు కేసులను వెంటనే సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో కోరారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది పనికిమాలిన పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్పై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తానని హెచ్చరించింది. ఈ పిటిషన్పై వాదించడానికి ఎలా వచ్చారని న్యాయవాది మహేంద్ర సింగ్పై జస్టిస్ త్రివేది అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులను మీలాంటి సీనియర్లు వాదిస్తారని అసలు అనుకోలేదని వ్యాఖ్యానించింది. ఆ వెంటనే పిటిషన్ను కొట్టివేసింది.