అమరావతి : చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరణించిన వారిని ఒకే కుటుంబానికి చెందిన దామోదర్ (కుటుంబ యజమాని), నిర్మల (భార్య), దిలీప్ (కుమారుడు), శ్రీవిద్య కుమార్తెగా పోలీసులు గుర్తించారు. దామెదర్ భార్య నిర్మల కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన దామెదర్ తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలోనే ఆయన మొదట తన భార్యకు, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదని సుసైడ్ లెటర్లో స్పష్టం చేశాడు. అంతేకాకుండా, తన ఏటీఎం కార్డులో డబ్బులు ఉన్నాయని, ఆ డబ్బును డ్రా చేసి తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియల ఖర్చులకు ఉపయోగించాలని ఆ లేఖలో కోరడం అందరినీ కలిచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.