అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని విద్యార్థి సంఘాల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. విజయవాడ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన ధర్నాకు పోలీసుల అనుమతి లేదంటూ విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకోవడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం జగన్ నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఖాళీగా ఉన్న 2లక్షల 50 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు. అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాలను ఆపలేరని వారు అన్నారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేయడం తగదని అన్నారు.