అమరావతి : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. అప్పుతీర్చాలంటూ బ్యాంకు అధికారులు వచ్చి అవమానించడంతో రైతుపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని జాస్తి వర్షిణి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో వర్షిణి 15వేల ర్యాంక్ సాధించింది.
ఉన్నత విద్య అభ్యసించడానికి చేతిలో డబ్బులు లేక తండ్రి చేసిన అప్పు తీర్చలేక బ్యాంకు అధికారుల ఒత్తిళ్ల తాళలేక వర్షిణి సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఇంటికి పలు దఫాలుగా వచ్చిన బ్యాంక్ అధికారులు అవమానకరంగా మాట్లాడడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో తల్లికి ఓ లేఖ రాస్తు సుసైడ్ చేసుకుంది.
‘ డాడీ డబ్బులు పంపుతాడో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఇళ్లు గడవడం కూడా కష్టంగా ఉంటుంది కదమ్మ ’ అందుకే చనిపోతున్నా . ‘ ఎవరన్నా అడిగితే ఎంసెట్లో ర్యాంకు రాలేదని అందుకే చనిపోయిందని’ చెప్పు అని ఆ లేఖలో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.