అమరావతి : అండమాన్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అది తుపానుగా మారే అవకాశం ఉందని తెలియజేసింది. డిసెంబరు 4న నాటికి క్రమంగా.. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా వస్తుందని పేర్కొంది. ఆ తదుపరి పెను తుపానుగా మారి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రత్యేకంగా ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది.
తుఫాన్కు జవాద్ నామకరణం చేసిన అధికారులు కోస్తాంధ్ర ప్రజలకు పలు విపత్తు శాఖ పలు హెచ్చరికలు జారీ చేశారు. మూడ్రోజుల పాటుపర్యాటక ప్రదేశాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.