Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ ఆగంతకుడు రాయి విసిరారు. ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయి విసిరి ఆగంతకుడు పరారయ్యాడు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తానని అన్నారు. తెనాలిలో పవన్ కల్యాణ్పై కూడా రాళ్లు వేశారని తెలిపారు. గత ఎన్నికలప్పుడు కూడా తనపై రాళ్లు వేశారని గుర్తు చేశారు. నిన్న జగన్ సభ సమయంలో కరెంటు పోయిందని అన్నారు. సీఎం సభలో కరెంటు పోతే బాధ్యత ఎవరు వహించాలని ప్రశ్నించారు. జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారని.. బాబాయి హత్యను తనపై నెట్టేందుకు ప్రయత్నించారని అన్నారు. నిన్న సీఎంపై చీకట్లో గులకరాయి పడిందన్నారు. ఇప్పడు తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడిందన్నారు.
కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కూడా ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. అదృష్టవశాత్తూ రాయి దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆదివారం నాడు తెనాలికి చేరుకుంది. ఈ సందర్భంగా వారాహి విజయభేరి బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ యాత్ర కొనసాగుతుండగా.. ఓ దుండగుడు పవన్ కల్యాణ్పై రాయి విసిరారు. అయితే ఆ రాయి పవన్కు తగలకుండా సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జన సైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే పోలీసులు బందోబస్తు ఉండటంతో వారికి అప్పగించారు.