అమరావతి : ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఏపీలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై మండిపడ్డారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు ఇవాళ వ్యూహ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఈ నెల 27న మహిళలకు న్యాయం చేయాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 8వందల మంది అత్యాచారాలకు గురైతే ఒక్కరికీ న్యాయం చేయలేదని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం అసమర్ధతతో పోలవరం ప్రాజెక్ట్ను బలి చేసిందని పేర్కొన్నారు. డయాప్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లపాటు ప్రభుత్వం ఎందుకు దాచింది, పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ ఎందుకు కూలిందో చెప్పకుండా టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. గతంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించినందుకు గాను నేడు సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు.
ఏపీలో హక్కుల కోసం ఐక్య పోరాటం చేస్తే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుంచి జూలై 8 కి మార్చడం విచారకరమన్నారు. నేరస్తులకు వైసీపీ ప్రభుత్వం కొత్త మార్గాలు చూపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినా తాగునీటి కష్టాలను తీర్చలేకపోతున్నారని ఆయన తెలిపారు.