TTD | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం తిరుమలలోని శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. తిరిగి మరుసటిరోజైన ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు. ఆదివారం అర్ధర్రాతి దాటాక 1.05 నుంచి 2.22 గంటల వరకు ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం 5 గంటలకు తలుపులు మూసివేస్తారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు తలుపులు తెరుస్తారు.
శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండ రామస్వామి, శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం రాత్రి 7 గంటలకు తలుపులు మూసివేసి, తెల్లవారుజామున 4.30 గంటలకు తెరిచి, శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. గ్రహణం కారణంగా శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పౌర్ణమి అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీనివాస మంగాపురంలో పౌర్ణమి గరుడ సేవ రద్దయ్యాయి. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో శనివారం అన్నాభిషేకం జరుగుతుంది. గ్రహణం కారణంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ తలుపులు మూసివేసి, మరునాడు ఉదయం 4 గంటలకు తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.