Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో పుర వీధులన్నీ కిటకిటలాడాయి. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. వరుసగా వారాంతపు సెలవులు కలిసిరావడంతో భక్తులు కుటుంబసమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకొన్నారు. స్వామి అమ్మవార్ల ఉచిత దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లతోపాటు అల్పాహారాన్ని అందిస్తున్నట్లు పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
శని, ఆదివారాలు క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు కుటుంబ సభ్యులతో బస చేసేందుకు సదుపాయాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవస్థాన వసతి గృహాలతో పాటు నిత్యాన్నదాన సత్రాల్లో అద్దె గదులు, డార్మెటరీలు లభించక పోవడంతో ఉద్యానవనాలు, ఫుట్పాత్లపై నిద్రించడం కష్టంగా ఉందని భక్తులు ఆవేదన చెందారు. ప్రత్యేక పర్వదినాల్లో సామాన్య భక్తులు కూడ బస చేసేందుకు వీలుగా ప్రత్యేక వసతి సదుపాయాలను కల్పించాలని యాత్రికులు కోరుతున్నారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ప్రదోషకాల సమయంలో నంది మండపంలోని శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలు జరిపించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
బెంగళూరుకు చెందిన కళాకారులు అక్కమహాదేవి చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించగా హైదరాబాద్కు చెందిన తిలాన ఆర్ట్స్ అకాడమి వారిచే కూచుపూడి నృత్య రూపక కార్యక్రమాలు జరిపించినట్లు పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.