శ్రీశైలం: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం వేదమంత్రోఛ్చారణల మధ్య మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో శాస్ర్తోక్త పూజలు జరిపించి ప్రాకారోత్సవాన్ని నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు.
దివ్యకాంతులను ప్రసరింపజేస్తూ భక్తులకు వరాలిచ్చే స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పుష్పోత్సవాన్ని జరిపించారు. అమ్మవారికి ప్రీతికరమైన కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లచామంతి, ఊదాచామంతి, మందారం, ఊదగన్నేరు, దేవగన్నేరు వంటి 18 రకాల ప్రత్యేక పుష్పాలు.. జామ, ఖర్జూర, నల్లద్రాక్ష వంటి 9 రకాల పండ్లతోపాటు బిల్వం, మరువం, మాచీపత్రితో ప్రత్యేక అలంకరణ చేశారు.
ఆ తరువాత విశేషాలంకరణ చేసిన స్వామివార్ల శయనమందిరంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవగా శయనోత్సవాన్ని నిర్వహించినట్లు ఈఓ తెలిపారు. మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిండం పట్ల కళాకారులతోపాటు ఆలయ అధికారులను సిబ్బందిని అభినందించారు.