Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో వైభవోపేతంగా నిర్వహించే దసరా నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్దం చేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు క్షేత్రానికి వచ్చే భక్తులకు సంపూర్ణ దర్శనం కల్పించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వారితో స్నేహభావంగా మర్యాదపూర్వకంగా మెలగాలని సిబ్బందికి తగు సూచనలు చేసినట్లు చెప్పారు. గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామోత్సవంలో వివిధ కళారూపాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్ని వాహన సేవలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
నవరాత్రులలో క్షేత్రానికి వచ్చే యాత్రికులు క్యూలైన్లు, మంచినీరు, వసతుల కల్పనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు చెప్పారు. ఈ నెల 15 నుండి జరిగే దేవిశరన్నవరాత్రులను యాగశాల ప్రవేశంతో శాస్ర్తోక్తంగా ప్రారంభిస్తారు. కలశస్థాపన, మండపారాధన అఖండజ్యోతి, మహగణపతి పూజ, జపానుష్టానాలతో పాటు లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ చండీ, రుద్రపారాయణాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23న శ్రీ మల్లిఖార్జున భ్రమరాంబికాదేవి స్వామి అమ్మవార్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
అదేవిధంగా దేవీ శరన్నవరాత్రులలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు మినహ మిగిలిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు తెలిపారు. వాహనసేవలను సామాన్యభక్తులు కూడా వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఈవో పెద్దిరాజు అన్నారు.
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికల్ వలెవన్ దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి అర్చక వేదపండితులు తిలకధారణ చేశారు. ఈవో పెద్దిరాజుతో పాటు అధికారులు పూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు.