Srisailam | శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానానికి రూ.5,16,84,417 ఆదాయం లభించింది. ఆలయంలోని హుండీల ద్వారా రూ.5,08,66,006, అన్న ప్రసాద వితరణ ద్వారా రూ.8,18,411 ఆదాయం లభించిందని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 13 రోజులుగా (ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11 వరకు) వచ్చిన హుండీ ఆదాయం, అన్నదాన ప్రసాద వితరణకు భక్తులు గతేడాది డిసెంబర్ 13 నుంచి మార్చి 11 వరకూ వచ్చిన విరాళాలను సమర్పించారని పెద్దిరాజు తెలిపారు.
హుండీలో 122.400 గ్రాముల బంగారం, 5.900 కిలోల వెండి లభించాయి. ఇంకా 240 అమెరికా డాలర్లు, 25 సింగపూర్ డాలర్లు, రెండు మలేషియా రింగిట్స్, 30 ఆస్ట్రేలియా డాలర్లు, 30 బ్రిటన్ పౌండ్లు, 20 యూఏఈ దిర్హామ్లు తదితర విదేశీ కరెన్సీ హుండీ కానుకల్లో వచ్చింది.
హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీటీవీ కెమెరాల నిఘాతో లెక్కించామని ఈఓ పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ పెద్దిరాజుతోపాటు డిప్యూటీ ఈఓ ఆర్ రమణమ్మ, అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివ సైనికులు పాల్గొన్నారు.