Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు లెక్కించారు. ఉభయ దేవాలయాల హుండీలతోపాటు పరివార దేవాలయాల హుండీలను లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,17,50,290 ఆదాయంగా వచ్చినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. వీటితోపాటు 187 గ్రాముల బంగారం, 6 .340 కిలోల వెండి ఆభరణాలతోపాటు 243 అమెరికా డాలర్లు, 450 ఆస్ట్రేలియా డాలర్లు, 15 యూఏఈ దిర్హామ్స్, 40 కెనడా డాలర్లు, ఆరు సింగపూర్ డాలర్లు, ఐదు యూరోలు తదితర విదేశీ కరెన్సీ కూడా స్వామి అమ్మవార్లకు మొక్కులుగా భక్తులు హుండీలో సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో త్రయోదశి సందర్బంగా ప్రత్యేక పూజలు జరిపించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. పరోక్షసేవలో భాగంగా గురువారం ప్రదోషకాల సమయంలో ఆలయ ప్రాంగణం నంది మండపంలో ఆశీనులైన నందీశ్వరునికి ప్రత్యేకాభిషేకాలు చేశారు. ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రజలతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలని ప్రదోషకాల సమయంలో మహా సంకల్పాన్ని పఠించి గణపతి పూజతో ప్రారంభించారు. వివిధ రకాల ఫలోదకాలు, ఉదకనీరు, పంచామృతాలు, భస్మంతో నందీశ్వరునికి అభిషేకాలు జరిపించిన తరువాత అన్నాభిషేకం చేశారు. వృషభ పురుషసూక్త వేదమంత్రాలతో పుష్పార్చన చేసి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.