అమరావతి : శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమానికి భక్తుల నుంచి స్పందన రాకపోవడంతో మహా కుంభాభిషేకాన్నివాయిదా వేస్తున్నట్లు ఏపీ దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్(Endowment Commissioner) ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 12 నుంచి 17వ తేదీవరకు ఆలయంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీ చండీ రుద్ర రాజశ్యామ సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని నిర్వహించారు.
ఈ ఉత్సవానికి భక్తుల నుంచి అనుకున్నంతగా స్పందన రాలేదు. వేసవి తీవ్రత వల్లే భక్తులు రాలేదని కారణం చెబుతున్న దేవాదాయ అధికారులు ఈనెల 25 నుంచి 31 వరకు జరుపతలపెట్టిన మహా కుంభాభిషేకాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. కార్తీకమాసంలో మహా కుంభాభిషేకం(Maha Kumbhabhishekam) మహోత్సవం నిర్వహిస్తే కార్యక్రమానికి అశేష భక్తులు పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని వేద పండితులు సూచించారు. దీంతో వారి సలహా మేరకు వాయిదా వేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.