Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం ప్రధాన విభాగాధిపతులు, ఇంజనీరింగ్ అధికారుల నేతృత్వంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు పక్కా ప్రణాళికలతో మౌళిక వసతులు కల్పించినట్లు తెలిపారు.
మండల దీక్షలు చేసుకుని స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం జ్యోతిర్ముడి సమర్పణ తరువాత మాల విరమణ చేసి దీక్షా వస్ర్తాలను పరిసరాలలో పారవేయకూడదని శివస్వాములను కోరారు. 5వ తేది వరకు మాత్రమే జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు నిర్ణీత సమయంలో ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలతో మూడు ప్రత్యేక క్యూలైన్ల ద్వార ఉభయ దేవాలయాల్లో దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే పాగాలంకరణ కార్యక్రమానికి ఆలయ ప్రాంగణంలో సుమారు 11 వేల మంది భక్తులు తిలకించేందుకు సన్నాహాలు చేశారు.