శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శనివారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు మరియు భక్తులు సహాయంతో లెక్కింపు జరిగింది. గత 15 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో రూపాయలు 5,60,66,953 (ఐదు కోట్ల అరవై లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు) ఆదాయంగా వచ్చినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు. వీటితోపాటు 403 గ్రాముల బంగారం, 10 కేజీల 400 గ్రాముల వెండి ఆభరణాలు మరియు 185 యుఎస్ఏ డాలర్స్, 04 సింగపూర్ డాలర్లు, 30 ఇంగ్లండ్ ఫౌంఢ్స్, 01 మలేషియన్ రింగట్ మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కాగా, మల్లికార్జున స్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి శనివారం ఉదయం దర్శించుకున్నారు. శ్రీకృష్ణా గోపురం చేరుకున్న వీరికి ఆలయ పీఆర్వో శ్రీనివాసరావుతో పాటు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల దర్శనాలు చేయించిన అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో వేదపండితులచే వేదాశీర్వచనాలు వల్లించి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం పరిమళ విభూధి ఇచ్చారు.
ఇక నిత్యకళారాధన వేదిక వద్ద సాయంత్రం హైదరాబాద్కు చెందిన సంధ్యకార్తిక్ బృందం వారిచే నిర్వహించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఆకట్టుకుంది. వివిధ రకాల భక్తిగీతాలకు చిన్నారులు నృత్యనివేదన సమర్పించారు.