Srisailam | శ్రీశైలం క్షేత్రంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను విజయవంతంగా పూర్తికావడంలో సహకరించిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి ఈవో పెద్దిరాజు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఈవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైదిక కమిటీ సభ్యులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఉగాది మహోత్సవాల కంటే వారం, పదిరోజుల ముందు నుంచే భక్తుల రద్దీ మొదలయ్యిందని తెలిపారు. అయితే ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులందరికీ సేవలు అందించగలిగామని చెప్పారు. అందరి సమిష్టి కృషి వల్లనే ఉగాది ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని అన్నారు. ఉత్సవాల నిర్వహణకు అహర్నిశలు శ్రమించి ఉత్సవాల నిర్వహణకు సిబ్బంది అందరూ తోడ్పాటు అందించారని అన్నారు. జిల్లా పోలీసు శాఖ, వైద్యారోగ్య శాఖ, అటవీ శాఖ మొదలైన ప్రభుత్వ శాఖలు ఉత్సవ నిర్వహణలో తమవంతు పాత్ర పోషించాయని అన్నారు.