Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు, పోలీసు, దేవస్థానం, రెవెన్యూ అధికారులు సోమవారం పర్యవేక్షించారు. క్షేత్ర పరిధిలోని పలు ప్రదేశాలను సందర్శించి, అక్కడ ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. సాయంకాలం ప్రభోత్సవం జరిగే ఆలయ వీధి, క్యూలైన్లలో పరిస్థితులను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా పార్కింగ్ ప్రదేశాలు, ఇతర రద్దీ ప్రదేశాలు, పాతాళగంగ, కాలిబాట మార్గం, క్షేత్ర పరిధిలోని పలు ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈఓ డీ పెద్దిరాజు తదితర అధికారులు మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని చెప్పారు. కంట్రోల్ రూమ్లోని స్క్రీన్ల ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్ర పరిధిలోని అన్ని ప్రదేశాలు, క్యూలైన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తుండాలని ఆదేశించారు. నిరంతరం అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు.
సోమవారం సాయంకాలం జరిగే ప్రభోత్సవం, రాత్రి జరిగే వీరాచార విన్యాసాలు – అగ్ని గుండ ప్రవేశ కార్యక్రమం ఏర్పాట్లన్నీ ఎటువంటి లోపం తలెత్తకుండా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు – అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాల్లో తొక్కిసలాటలు జరుగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని దేవస్థానం భద్రతా విభాగం అధికారిని ఆదేశించారు. భద్రతా చర్యలపై పోలీస్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కూడా సూచించారు.
క్యూ లైన్ల పరిశీలన సందర్భంగా ఈఓ డీ పెద్ది రాజు మాట్లాడుతూ క్యూలైన్లలో అన్ని ఫ్యాన్లు నిరంతరం పని చేసేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే నిరంతరం అల్ఫాహారం, మంచినీరు, మజ్జిగ, బిస్కట్లు పంపిణీ చేయాలన్నారు. స్వామి వారి నివేదన తదితర కైంకర్యాలకు దర్శనాలు ఆపినప్పుడు ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు ఈ విషయం తెలియజేస్తూ ఉండాలని అన్నారు. ఆయా ప్రదేశాలను పరిశీలిస్తున్నప్పుడు అధికారులు పలువురు భక్తులతో ముఖాముఖీ సంభాషించి, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.